డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురు

  • తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ లక్ష్మీదుర్గ పిటిషన్
  • సిట్ ఆధారాలను పరిశీలించిన కోర్టు
  • కేసు నుంచి ఆమెను తప్పించడం సాధ్యం కాదని స్పష్టీకరణ

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.


ఈ వ్యవహారంలో లక్ష్మీదుర్గ ప్రమేయంపై సిట్ సేకరించిన ప్రాథమిక ఆధారాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది. హత్య జరిగిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేయడంలోనూ, మృతదేహాన్ని తరలించిన వాహనంలో ఆమె స్వయంగా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఈ క్రమంలో ఆమెను ఏ2 నిందితురాలిగా చేర్చడం సరైనదేనని అభిప్రాయపడిన కోర్టు, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం ఆమెను కేసు నుంచి తప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.


మరోవైపు, తన భార్య అమాయకురాలని, రాజకీయ కక్షతోనే ఆమెను ఈ కేసులో ఇరికించారని అనంతబాబు వాదించినప్పటికీ న్యాయస్థానం దానికి అంగీకరించలేదు. నిందితుల తరపు వాదనలను తోసిపుచ్చుతూ, కేసు పూర్వాపరాలను బట్టి విచారణ కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజా తీర్పుతో ఈ కేసులో అనంతబాబు కుటుంబానికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


Ananta Babu
Driver Subramanyam murder case
MLC Ananta Babu
Lakshmi Durga
Andhra Pradesh crime
Rajahmundry court
SIT investigation
Evidence tampering
Political conspiracy

More Telugu News